Telangana Fuel Supply : తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతోందంటూ సోషల్ మీడియాలో , ప్రజల్లో జరుగుతున్న ప్రచారానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు డిమాండ్ అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాలను వివరిస్తూ, సరఫరాను పునరుద్ధరించడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇంధన డిమాండ్ ఊహించని విధంగా పెరగడానికి ప్రధానంగా పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులే కారణమని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం నిండుకోవడంతో (Dry-outs), ఆ ప్రభావం ఖమ్మం, మిర్యాలగూడ వంటి సరిహద్దు ప్రాంతాలపై పడింది. ఇదే తరహా పరిస్థితి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిర్మల్ జిల్లాలో కూడా తలెత్తింది. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజల్లో ‘పానిక్ బయింగ్’ (భయాందోళనతో కొనుగోలు చేయడం) మొదలైంది. ఫలితంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంధన డిమాండ్ అమాంతం పెరిగింది.
ప్రస్తుత పరిస్థితికి మరో ముఖ్య కారణం పారిశ్రామిక , రిటైల్ డీజిల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. ఏప్రిల్ 16, 2026 నాటి సవరణల ప్రకారం, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్ ధర లీటరుకు రూ. 150 ఉండగా, రిటైల్ బంకుల్లో మాత్రం రూ. 95 కే లభిస్తోంది. ఈ రూ. 55 భారీ వ్యత్యాసం వల్ల వాణిజ్య వినియోగదారులు (బస్సులు, ఫ్యాక్టరీలు) పెద్ద ఎత్తున రిటైల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయనే వదంతులతో ప్రజలు ముందుగానే నిల్వ చేసుకోవడం ప్రారంభించారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచే చమురు సంస్థలతో (OMCs) సమన్వయం చేసుకుంటూ సరఫరాను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 29 నాటి గణాంకాల ప్రకారం.. రోజువారీ సగటు 7,348 కేఎల్ నుంచి ఏకంగా 210 శాతం పెరిగి 22,782 కేఎల్కు చేరుకుంది. సగటు కంటే 132 శాతం పెరిగి 13,622 కేఎల్గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,536 అవుట్లెట్లకు 3,817 ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేయబడుతోంది.
జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో “డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై కమిటీ”లను ఏర్పాటు చేశారు. బంకుల వద్ద రద్దీని నియంత్రించేందుకు , నిఘా కోసం పౌరసరఫరాలు, రెవెన్యూ , పోలీస్ అధికారులను మోహరించారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కావడంతో హార్వెస్టర్లు, రవాణా వాహనాలకు ఇంధన ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇంధనానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. వదంతులను నమ్మి అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా భరోసా ఇస్తోందని అధికారులు కోరారు.
