Site icon NTV Telugu

Telangana Formation Day LIVE: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Kcr1 (1)

Kcr1 (1)

ప్రగతి భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సీఎం కేసీఆర్. జాతీయ గీతం ఆలాపన. మిఠాయిలు పంచారు నేతలు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న శుభసందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన ఈ సందర్భంలో ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాలని అన్నారు. వ్యవసాయం, సాగు నీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక అభివృద్ధిని నమోదుచేసుకొంటున్నదని సీఎం తెలిపారు.

The liveblog has ended.
  • 02 Jun 2022 10:03 AM (IST)

    తెగించి పోరాడిన ఉద్యమకారులకు వందనం

    ఉద్య‌మానికి ఊపిరిలూదిన మేధావుల‌కు,ప్రాణాల‌కు తెగించి పోరాడిన ఉద్య‌మ‌కారుల‌కు, ప్రాణత్యాగం చేసిన అమ‌రుల‌కు,గ‌జ్జె క‌ట్టి, గొంతు విప్పిన క‌ళాకారుల‌కు, క‌విత‌లు,పాట‌లతో ఉర‌క‌లెత్తించిన క‌వుల‌కు,క‌లంతో ఉద్య‌మాన్ని వెలుగెత్తిన పాత్రికేయుల‌కు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలకు,కవులకు,మేధావులకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల.

  • 02 Jun 2022 09:39 AM (IST)

    దేశంలో మత పిచ్చి తప్ప అభివృద్ధి లేదు

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మనతో పాటు స్వాతంత్య్యం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్ లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నం. ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది.విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది.

    అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.

    నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు.భారత దేశంలో ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.

  • 02 Jun 2022 09:33 AM (IST)

    కేంద్రం సహకరించకున్నా.. రైతులకు భరోసా

    కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నాను.కుట్రపూరితంగా రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం, ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి.

    పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయి.
    పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి.విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను,స్వయంప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి.

  • 02 Jun 2022 09:31 AM (IST)

    కేంద్రం పై తీవ్ర స్థాయిలో విమర్శలు

    సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది.

    దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. కేంద్రం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కెసిఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భముగా అయన ప్రసంగించారు... కేంద్రం పై ఎటాక్ చేశారు కేసీఆర్.

  • 02 Jun 2022 09:30 AM (IST)

    75 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంత పేదరికమా?

    కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది.

    మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు.

    రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం.ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్రం ఎందుకు పీడిస్తున్నది?

  • 02 Jun 2022 09:24 AM (IST)

    బలమయిన కేంద్రం.. బలహీనమయిన రాష్ట్రాలు

    ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది.కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది.

    రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది.ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది.
    రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

  • 02 Jun 2022 09:23 AM (IST)

    తెలంగాణ అందరికీ స్ఫూర్తి

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. దీంతో ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపు త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొన్న‌ శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు.

  • 02 Jun 2022 09:22 AM (IST)

    అమరవీరుల త్యాగాలు స్మరించుకుందాం

    తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి నేటి తో ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపారు. తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ శుభాకాంక్షలని, చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version