తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్కూ అన్యాయం జరిగిందని రేవంత్రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదన్నారు.
మరోవైపు.. అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశయాలను కేసీఆర్ ఏనాడో తొక్కేశారని మండిపడ్డారు. దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, దళిత, గిరిజన దండోర సభలను కొనసాగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. రెండో సభను ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.