NTV Telugu Site icon

TG Cabinet : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

Tg Cabinet

Tg Cabinet

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. అటువంటి పరిస్థితి ఉన్న చోట జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల విభాగం అధికారులకు నివేదించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వేగంతో మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడ సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చిన కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులు జవాబుదారీగా ఉండాలని కేబినెట్‌ పేర్కొంది.

అంతేకాకుండా..’ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో సన్న రకాల వరి సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి ఎమ్మెస్పీపై రూ.500 బోనస్ చెల్లించాలని కేబినేట్లో నిర్ణయం జరిగింది. వానాకాలం పంటకు యాక్షన్ ప్లాన్ పై కేబినెట్ లో చర్చ జరిగింది. గత ఏడాది వానా కాలంలో 1.44 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వర్షాలు పడుతాయనే అంచనాలతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున వచ్చే ఖరీఫ్లో 1.50 లక్షల ఎకరాల పంటలు సాగువతాయని అంచనా. వానాకాలం పంటకు కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం అధికారులకు సూచించింది. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలకు నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ఇందుకు సంబంధించి వీడియోలు తయారు చేయించి, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. సినిమా థియేటర్లలోనూ ప్రకటనలు వేయించాలి. విత్తనాల అమ్మకంపై ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి. ఏయే విత్తన కంపెనీలు ఏయే జిల్లాల్లో రైతులకు విత్తనాలు అమ్ముతున్నాయో వ్యవసాయ శాఖ రికార్డు చేయాలి. విత్తనాలు అమ్మే వ్యాపారులు ఏయే రైతులకు అమ్మారో రికార్డు చేయాలి.

విత్తనాల సేల్స్ కు సంబంధించిన లిస్ట్ వ్యవసాయశాఖ వద్ద ఉండేలా చర్యలు చేపట్టాలి. నకిలీ విత్తనాల అమ్మకం జరిగితే సంబంధిత కంపెనీలను జవాబుదారీగా చేయాలి. తెలంగాణ ఏర్పడి పదేండ్లు అయిన సందర్భంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలి. ఈ వేడుకలకు శ్రీమతి సోనియాగాంధీ గారిని ఆహ్వానించటంతో పాటు తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించుకునేందుకు అనుమతి కోరుతూ ఈసీ కి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయటంతో భారీగా మార్పు తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా స్కూల్స్ మెయింటెనెన్స్ ను ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జూన్ 10 లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. పాఠశాలలు తెరిచే లోగా పెయింటింగ్స్, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసేలా చూడాలని నిర్ణయం

పాఠశాలలు ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ ) ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినేట్ సిఫారసు చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేపట్టినా తదుపరి ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ ప్రస్తావించిందని, మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఏ చేసిన సిఫారసును మంత్రివర్గం ప్రత్యేకంగా గుర్తించింది. అందుకే అత్యవసరంగా చేపట్టాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు చేయించాలని, ఎన్డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలకు వీటిని అప్పగించి, నెల రోజుల్లో రిపోర్టులు అందేలా చూడాలని అధికారులను కోరింది. ఈలోపు చేపట్టాల్సిన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టు కంపెనీలతోనే చేయించాలని నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగితే బ్యారేజీకి ఇబ్బంది లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని, అవసరమైన తాత్కాలిక చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేసింది.