తెలంగాణ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్ట్ వ్యవహారంలో వారికి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై నమోదైన కేసులో వీరిద్దరినీ రిమాండ్కు తరలించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను నాంపల్లి నాంపల్లి క్రిమినల్ కోర్టు తీవ్రంగా తోసిపుచ్చింది. రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయస్థానం, ఎమ్మెల్సీలిద్దరినీ తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీ ముట్టడి, అరెస్టే నేపథ్యం
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా నిరసన ప్రదర్శనలు, పోలీసులకు-ప్రతిపక్ష నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారనే తీవ్రమైన ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు , నవీన్ రెడ్డిలను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు ఆదేశించాలని కోరారు.
పోలీసుల వాదనను తోసిపుచ్చిన కోర్టు
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన నాంపల్లి కోర్టు, చట్టపరమైన ప్రక్రియ , సమర్పించిన ఆధారాలను సంతృప్తికరంగా లేవని భావించింది. రిమాండ్కు బలమైన కారణాలు లేవని తేల్చిచెబుతూ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్సీలిద్దరి విడుదలకు మార్గం సుగమమైంది, ఇది పోలీసు యంత్రాంగానికి , అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.
తాతా మధు ఆరోపణలు… ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు
రిమాండ్ తిరస్కరణకు ముందు ఎమ్మెల్సీ తాతా మధు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా తమ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అక్రమంగా దాడులు చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం
అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఈ వరుస పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్పీకర్ స్థానాన్ని అవమానించారని , పోలీసులపై దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తమ గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది.

