ACB Raids : అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్-II గా పనిచేస్తూ, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న దేవులూరి ఆనంద్ ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం (మే 20, 2026) సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆనంద్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో సదరు అధికారికి ఏకంగా రూ. 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది.
ఈ ఏసీబీ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. డాక్యుమెంట్ల ప్రకారం సుమారు రూ. 71,56,708 విలువైన రెండు లగ్జరీ నివాస గృహాలు, అలాగే రూ. 28,37,000 విలువైన ఆరు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి ప్రస్తుత ఓపెన్ మార్కెట్ విలువ అధికారిక ప్రభుత్వ అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.
స్థిరాస్తులతో పాటు ఇళ్లలో దాచిన రూ. 24,50,450 లిక్విడ్ క్యాష్, రూ. 7,05,367 బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే రూ. 6,07,700 విలువైన హోమ్ అప్లయన్సెస్ (గృహోపకరణాలు) కనుగొన్నారు. వీటితో పాటు రూ. 13,25,000 విలువ చేసే ఒక లగ్జరీ కారు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సదరు సస్పెండెడ్ అధికారి ఇంట్లో ఏకంగా 819.5 గ్రాముల బంగారం, 2264.5 గ్రాముల వెండి వస్తువులు లభించాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 43,16,930 గా అధికారులు లెక్కగట్టారు. ప్రస్తుతం ఈ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి, దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
