Srisailam Dam: కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి శ్రీశైలం వైపు వేగంగా దూసుకొస్తోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో ఏకంగా 220 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా, కోయనా నదులు ప్రళయరూపంలో ప్రవహిస్తున్నాయి. అక్కడ రాధానగరి, వారణా జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో, రాబోయే 48 గంటల్లో ఆల్మట్టి డ్యామ్కు ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ప్రవాహం మరింత తీవ్రతరం కానుంది.
ప్రస్తుతం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.20 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ఉధృతి మరొక వారం రోజులు ముమ్మరంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, అధికారులు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మను పరుగులు తీయించనున్నారు.

