Site icon NTV Telugu

Singireddy Niranjanreddy : వానాకాలం సాగు ప్రణాళికపై సమీక్ష

వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని, రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామని, ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలని, మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలన్నారు. కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలని, దీనికి సంబంధించి మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పంటల ప్రణాళికపై జిల్లాల వారీగా ఏఈఓలకు శిక్షణ కల్పించాలన్నారు.

ఆయిల్ పామ్ సాగు కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులు సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని, దీని కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలన్నారు. రైతు వేదికలను అవగాహన కోసం కోసం విరివిగా ఉపయోగించుకోవాలని, రైతుబంధు సమితులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.

Congress : పీకే ఎంట్రీతో కాంగ్రెస్‌ రాత మారుతుందా..!

Exit mobile version