బెంగళూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాను చందర్ రెడ్డి కుంట (32), బీబీ షాజియా సిరాజ్ (31) భార్యాభర్తలు. బీబీ షాజియా సిరాజ్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పని చేస్తోంది. అయితే సోమవారం అపార్ట్మెంట్లో ఒక గదిలో భాను చందర్ రెడ్డి కుంట ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. షాజియా సిరాజ్ ఇంటికొచ్చి చూడగా గది తలుపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన కరవైంది. దీంతో ఇరుగుపొరుగు, భద్రతా సిబ్బందిని పిలిచింది. దీంతో వారు తలుపు బద్దలు కొట్టగా భాను చందర్ రెడ్డి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. క్షణాల వ్యవధిలోనే ఆమె కూడా 17వ అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి సాఫ్ట్వేర్ దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో అపార్ట్మెంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక దంపతుల మరణ వార్త తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అసహజ మరణాలుగా వేర్వేరు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టానికి తరలించారు. అయితే ఆరోగ్య సమస్యలు, ఇద్దరి మధ్య సంబంధాల సమస్యలు, మానసిక క్షోభ వంటి అనేక కోణాల్లో మరణాలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
