Tragedy : సంగారెడ్డి జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జిల్లాలోని కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బట్టలు ఉతకడానికి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు బావిలో పడిపోగా, వారిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారు కూడా బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. నీటిలో మునిగిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని తల్లి సావిత్రి బాయి, ఆమె కుమార్తెలు నికిత (13), నందిని (12) గా గుర్తించారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఇద్దరు ఆడపిల్లలతో పాటు తల్లి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను బావిలో నుండి బయటకు తీశారు. చేతికి అందొచ్చిన పిల్లలు, భార్య కళ్ల ముందే శవాలుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
