Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద నూతనంగా రూ. 1,009 కోట్ల నిధులను విడుదల చేయగా, ఆ మొత్తాన్ని నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజా విడుదలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 8,759 కోట్లకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం ద్వారా ఇప్పటివరకు దాదాపు 74 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.45 కోట్ల ఎకరాల సాగు భూములకు గానూ మొత్తం రూ. 7,750 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ, సాగు సీజన్లలో రైతులకు పెట్టుబడి కష్టాలు రాకుండా చూసేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ నిధుల విడుదల ద్వారా స్పష్టమవుతోంది.

