Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!

  • పర్యటన రద్దుపై రాజకీయ దుమారం
  • అనుమతులు నిరాకరించడం కొత్త కాదన్న కిషన్ రెడ్డి
  • రేవంత్‌పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
  • విదేశీ టూర్‌పై కాంగ్రెస్-బీజేపీ వార్
Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పర్యటనకు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించడం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

నిబంధనలు కొత్తవి కావు.. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయి

కేంద్రమంత్రులు లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోక తప్పదని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విదేశాంగ నియమావళి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, గతంలో కాంగ్రెస్ హయాం నుంచే అమల్లో ఉందని గుర్తుచేశారు. గతంలో 2005లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లేందుకు, ఆ తర్వాత లండన్ పర్యటనలకు కేంద్రమే అనుమతులు ఇచ్చిందని, కాబట్టి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.

అర్హత లేని వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నం?

ముఖ్యమంత్రి పర్యటనల విషయంలో అధికారులు అనేక అంశాలను సేకరించి, ఆయా సమావేశాల్లో పాల్గొనే వ్యక్తుల స్థాయి, వారి బ్యాక్‌గ్రౌండ్ , దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి తన హోదాకు తగిన వ్యక్తులను కాకుండా అర్హత లేని వారిని కలవాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు. భారత ప్రధానిని ఉగ్రవాదితో పోల్చి, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవడానికి సీఎం ప్రయత్నించారని, దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రమంత్రులకు కూడా పర్యటనలు నిరాకరిస్తారు

విదేశాంగ విధానాలు, క్లియరెన్సులు లభించకపోవడం వంటి సాధారణ సాంకేతిక కారణాల వల్ల గతంలో తాను కెనడా, రష్యాలకు వెళ్లే పర్యటనలను కూడా విదేశాంగ శాఖ తిరస్కరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇలా అనేకమంది కేంద్రమంత్రుల విషయంలో జరుగుతుందని, ఇది ఏదో రేవంత్ రెడ్డికి మాత్రమే జరిగిన అన్యాయం లాగా ప్రచారం చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.