Site icon NTV Telugu

CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

Cm Revanth Reddy

Cm Revanth Reddy

స‌మాజాభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా భాగ‌స్వామ్యంగా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్య‌యం వంద‌కు వంద శాతం స‌త్ఫ‌లితాలు ఇచ్చేలా ఉండాల‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యా, వైద్యం, జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలియ‌జేశారు. కంపెనీలు వీటితో పాటు త‌మ‌కు ఇష్ట‌మైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వంతో పాటు కంపెనీలు క‌లిపి చేసే వ్య‌యంతో తెలంగాణ విద్యార్థుల‌ను ప్ర‌పంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భ‌విష్య‌త్ అవ‌కాశాల‌ను వారు అందిపుచ్చుకునేలా త‌యారు చేయ‌గ‌ల‌మ‌ని సీఎం అన్నారు. విద్య‌పై పెట్టే వ్యయాన్ని తాము భ‌విష్య‌త్ త‌రాల‌పై పెట్టే పెట్టుబ‌డిగా భావిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్య‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలోనే 44 శాతం ఉన్నార‌ని.. వారికి నాణ్య‌మైన విద్య అందించాల్సిన బాధ్య‌త మ‌న అందరిపైన ఉంద‌న్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వ‌స‌తుల‌ను వినియోగించుకుంటున్నందున త‌మ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాల‌న్నారు.

 

సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన విధానం లేనందున తాము ఒక ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఇందుకు నియ‌మించామ‌ని సీఎం తెలిపారు. కంపెనీల ప్ర‌తినిధులు ఆయ‌న‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని త‌మ‌కు ఆస‌క్తి ఉన్న విద్యా, వైద్యం, జ‌ల వ‌న‌రులు, నైపుణ్య శిక్ష‌ణ‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌, అడ‌వుల సంర‌క్ష‌ణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించ‌వ‌చ్చ‌ని సీఎం తెలిపారు. ఇప్ప‌టికే ర‌హేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, య‌శోద ఫౌండేష‌న్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని.. వారికి సీఎం అభినంద‌న‌లు తెలిపారు. కంపెనీల ప్ర‌తినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా ఎవ‌రూ త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని తెలిపారు. ఈ విష‌యంలో చొర‌వ తీసుకున్నందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. పాఠ‌శాల విద్యా, ఆసుపత్రులు, వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు వారు ఆస‌క్తి చూపారు.. స‌మావేశంలో ర‌హేజా ఫౌండేష‌న్ నుంచి శ్రావ‌ణ్ కుమార్‌, రాంకీ ఫౌండేష‌న్ నుంచి దాక్ష‌య‌ణి ఆళ్ల‌, య‌శోద ఆసుప‌త్రి నుంచి డాక్ట‌ర్ గోరుకంటి సురేంద‌ర్ రావు, గోరుకంటి ఫ‌ల్గుణ్ రావు, మేఘా నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుప‌త్రి నుంచి అప‌ర్ణా రెడ్డి, కామినేని భాస్క‌ర్ రెడ్డి, ఇండియ‌న్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖ‌ర్ రెడ్డి, NAADAM ఫౌండేష‌న్ నుంచి ప‌గిడిపాటి దేవ‌య్య‌, రుద్ర‌మ‌దేవి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వెంక‌టేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన, పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version