CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..

  • బండి భగీరథ్ అరెస్టుపై సీఎం రేవంత్ క్లారిటీ
  • కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై ఘాటు వ్యాఖ్యలు
  • ధాన్యం సేకరణ జాప్యానికి కారణాలు వివరించిన సీఎం
  • శవరాజకీయాలు చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హెచ్చరిక
Revanth

Revanth

CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్టుపై వస్తున్న ఊహాగానాలను, దొడ్డిదారి లొంగుబాటు ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “మా పోలీసులు చెప్పిన వాస్తవాలనే మేము చెప్తాం. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే ఇంట్లోనో లేక పోలీస్ స్టేషన్‌కో వచ్చి అప్పగిస్తారు. అంతేగానీ, పోలీసులు రోడ్డుపై ‘నాకాబందీ’ (చెక్ పోస్ట్) నిర్వహిస్తుండగా దొరికితే.. దాన్ని ముందస్తు లొంగుబాటు అంటారా?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్, ఇతర ప్రతిపక్ష నేతల తీరును తప్పుబడుతూ.. “ఇక్కడ కేటీఆర్ జడ్జి లాగా, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO) లాగా వ్యవహరిస్తున్నట్టు ఉన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫిర్యాదు రాగానే చట్టప్రకారం కేసు పెట్టాం. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసులలో కూడా తాము పద్ధతిగా వ్యవహరిస్తున్నాం. వాళ్లలాగా మేము రోడ్డు మీద పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడలేం” అని సీఎం ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, దీనివల్ల రవాణాలో స్వల్ప అంతరాయం కలిగిందే తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వేగంగా ధాన్యాన్ని సేకరిస్తోందని, కొనుగోలు చేసిన కేవలం 72 గంటల్లోపు నేరుగా రైతులకు డబ్బులు చెల్లిస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం రైతుల మరణాలను వాడుకుంటూ ‘శవరాజకీయాలు’ చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో అప్పటి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు మౌనంగా ఉన్న నాయకులు, ఇప్పుడు తమ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి మంత్రులను, కలెక్టర్లను స్వయంగా పంపి పర్యవేక్షిస్తున్నామని, ప్రజల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.