CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

  • పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
  • కోయిల్ సాగర్, జూరాల డ్యామ్, కొత్త బ్యారేజీ ప్రాంతాల పరిశీలన
  • కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
  • ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులకు ఆదేశం
Cm Revanthv

Cm Revanthv

CM Revanth Reddy : పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఈ సర్వేలో పాల్గొన్నారు.

కీలక ప్రాజెక్టుల పరిశీలన

ముఖ్యమంత్రి , మంత్రుల బృందం పాలమూరు జిల్లాలోని పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఆకాశ మార్గం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించింది. ముఖ్యంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, , జూరాల ప్రాజెక్టు డ్యామ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

×
×
Ad

కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక ఫోకస్

ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పథకంలో అత్యంత కీలకమైన కాట్రేవుపల్లి పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనుల నిర్మాణ శైలిని, పురోగతిని సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా వీక్షించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుండటంతో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ యుద్ధప్రతిపాదికన వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రుల బృందం కూడా ప్రాజెక్టుల వారీగా ఉన్న అడ్డంకులను తొలగించి, పనులను త్వరగా ముగించాలని అధికారులకు సూచించింది.