Konda Sushmita : వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని ఆనాడు మొదట కోరింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పరకాల ప్రజలకు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరికీ తెలియదని, కొండా మురళి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం వల్లే ఆయన విజయం సాధించారని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ అధిష్టానం అంటే అత్యంత గౌరవం ఉందని, అయితే తమ కుటుంబం ఎవరికీ ఊడిగం చేసే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. రాబోయే రోజుల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసి తీరుతానని, పరకాల గడ్డ తనదేనని కొండా సుస్మితా అత్యంత ధీమాతో ప్రకటించారు.

