Konda Sushmita : వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని ఆనాడు మొదట కోరింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను అలా అనలేదని భావిస్తే రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు పరకాల ప్రజలకు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరికీ తెలియదని, కొండా మురళి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం వల్లే ఆయన విజయం సాధించారని స్పష్టం చేశారు. చేతనైతే రేవూరితో రాజీనామా చేయించి, రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆయనను మళ్లీ గెలిపించాలని, మళ్లీ గెలిపిస్తానని ఇప్పుడు ఎలా ప్రకటిస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు , విధానాలు సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా వంటబట్టలేదని సుస్మిత విమర్శించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారిపై ఉన్న ప్రేమ, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న అసలైన కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి “అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్” అన్నట్లుగా తయారైందని, దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా సంతృప్తిగా లేరని చెప్పారు. తమకు కాంగ్రెస్ అధిష్టానం అంటే అత్యంత గౌరవం ఉందని, అయితే తమ కుటుంబం ఎవరికీ ఊడిగం చేసే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. రాబోయే రోజుల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసి తీరుతానని, పరకాల గడ్డ తనదేనని కొండా సుస్మితా పటేల్ అత్యంత ధీమాతో ప్రకటించారు.

