CM KCR: 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని కేసీఆర్ అన్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన 26 జనవరి రోజు భారత పౌరులందరికీ పండుగ రోజని సీఎం అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని సీఎం తెలిపారు.
Read also: Hero Sharwanand: గ్రాండ్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థం
గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు, సాంప్రదాయాలు భాషలు ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగివుండడమే భారత దేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం పరిఢవిల్లి, దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం అన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని సీఎం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ నవీన్ రావు, శ్రీ శంభీపూర్ రాజు, శ్రీ మధుసూధనా చారి, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Sajjala Ramakrishna Reddy: పవన్పై సజ్జల సెటైర్లు.. ఆ నాల్గో ఆప్షన్ కూడా చెప్పాలింది..!