Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ , డైట్ ఛార్జీల పెంపు వంటి నిర్ణయాలతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
పేదవాడి ఆత్మగౌరవం కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అందులో కేవలం అశ్వారావుపేట నియోజకవర్గానికే నాలుగు వేల ఇళ్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. చివరి పేదవాడి వరకూ లబ్ధి చేకూరుస్తామని చెప్తూ, భూమి లేని పేద ఆడబిడ్డల కోసం ఐదెకరాల్లో G+3 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నాడు కేవలం పింక్ కలర్ పార్టీ వారికి మాత్రమే అందిన లబ్ధి, నేడు ప్రతి పేదవాడికి చేరుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో మార్పుల గురించి ప్రస్తావిస్తూ అశ్వారావుపేటలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ కులమతాలకు, పేద ధనిక తారతమ్యం లేకుండా సుమారు 2300 మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పారు. దీనితో పాటు త్వరలోనే ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అశ్వారావుపేటకు వంద పడకల ఆసుపత్రిని, నర్సింగ్ కాలేజీని మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. స్థానికంగా కొమురం భీమ్ అర్బన్ పార్క్ ప్రారంభం, పూసుకుంట కొండ రెడ్ల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ పేదవాడి ప్రభుత్వమని, భవిష్యత్తులో ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు , పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

