Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో లేదా డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ జెండాను కాదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
నేను నీకు అమ్ముడుపోయానా? సీఎం రేవంత్రెడ్డికి సూటి ప్రశ్న
పార్టీ మారిన ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ కండువా కప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారని పోచారం ఆరోపించారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు అభివృద్ధి పనులను నిలిపివేశారని తెలిపారు. గతేడాది నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు.. “నేను నీకు అమ్ముడుపోయానా? లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా?” అని సీఎమ్ను సూటిగా నిలదీసినట్లు వెల్లడించారు. బాన్సువాడ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చివరికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా తమ ఫోన్లు ఎత్తడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి.. అన్నం పెట్టినవారిని మర్చిపోను
బాన్సువాడ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పోచారం కొనియాడారు. “అన్నం పెట్టిన వాళ్లను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది దౌర్భాగ్యుల వల్లే నేను పార్టీ మారాల్సి వచ్చింది” అని బాంబేల్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

