ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ఒక సెట్ నామినేషన్లను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు, ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం అన్నారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్ కు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ ఆలోచనలు చర్యలు ఉన్నాయన్నారు.
అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు, మంత్రుల ఆశీర్వాదాలు, ఓటర్ల ఆదరాభిమానాలతో తాను మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం జనవరి 4తో ముగిసిపోనుంది.