టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత పథలం అని టీఆర్ఎస్ చెప్తుంటే.. ఎందుకు ఇప్పుడు ఆగిందని నిలదీశారు రేవంత్రెడ్డి.
మరోవైపు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ ఎందుకు దళిత బంధు అమలుకు చొరవ చూపడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రులు ఎందుకు ఎన్నికల అధికారులను కలవడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్-బీజేపీ ఇద్దరు లంగ నాటకం ఆడుతున్నారని.. అందులో భాగంగానే దళిత బంధు ఆగిపోయిందన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్రెడ్డి. బీసీల మీదకు దళితులను ఉసిగొలిపే చర్యలకు సీఎం దిగుతున్నారని ఆరోపించిన ఆయన.. సీఎం కులాల మద్య చిచ్చు పెట్టే కామెంట్స్ పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.. కేసీఆర్పై కేసు పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులను సీఎంను చేయండి అని దళితులు అడగలేదు.. మూడెకరాల భూమి అడగలేదు.. వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారన్నారు. సీఎం కేసీఆర్ని అడుగుతున్న వర్గీకరణ కోసం ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లడం లేదు? అని నిలదీశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.