Vishnuvardhan Reddy: కాంగ్రెస్‌లోనే ఉన్నా.. సోదరి చేరికపై నో కామెంట్..!

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

దివంగత కాంగ్రెస్‌ నేత పి. జనార్ధన్‌రెడ్డి.. పార్టీ కోసం, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఎంతో కీలకంగా పనిచేసిన వ్యక్తి.. ఇక, ఆయన వారసులు కూడా రాజకీయాల్లోనూ ఉన్నారు.. ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయగా.. ఆయన కూతురు విజయారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు.. ఈ మధ్యే అధికార టీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.. అయితే, గత కొంత కాలంగా పీజేఆర్ కుమారుడు విష్ణు వర్ధన్‌రెడ్డి మాత్రం.. అంత యాక్టివ్‌గా లేరు.. కానీ, తన సోదరి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అనూహ్యంగా తన ఇంట్లో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి సీనియర్లు అందరికీ ఆహ్వానలు పంపినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన విష్ణువర్ధన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Chandrashekhar Guruji: హుబ్లీలో కలకలం.. చంద్రశేఖర్‌ గురూజీ దారుణ హత్య

తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు విష్ణువర్ధన్‌రెడ్డి.. ఇకపై యాక్టివ్ గానే ఉంటానని తెలిపారు. పార్టీ పదవులు ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇక, అందరినీ కలుద్దాం అనే భోజనానికి పిలిచాన్న విష్ణు.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు.. ఈ విందు సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కూడా ఆహ్వానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. తన సోదరి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంపై విష్ణును ప్రశ్నించగా… విజయారెడ్డి గురించి నన్ను అడగకండి.. ఆ ఇష్యూపై నో కామెంట్‌ అంటూ దాటవేశారు. ఇక, ఎవరు పార్టీలోకి వచ్చినా అది పార్టీ నిర్ణయమే అన్నారు.. పీజేఆర్‌ వారసత్వం అంటే నేనొక్కడినే కాదు.. కార్యకర్తలు అందరూ కలిసి పార్టీని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు విష్ణువర్ధన్‌రెడ్డి.