NIMS : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా సాగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది, ఏటా లక్షలాది మంది పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురదజల్లుతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదానికి గల అసలు కారణాన్ని డాక్టర్ బీరప్ప మీడియాకు వివరించారు. నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఒక రోగికి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి వ్యక్తిగతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యానికి రాతపూర్వక ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, ప్రాథమిక విచారణ జరిపి సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించిందని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు.
కేవలం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి వ్యక్తిగతంగా చేసిన మోసాన్ని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని చిలువలు పలువలు చేసి ‘నిమ్స్లో కిడ్నీ రాకెట్’ అంటూ ఒక పెద్ద దందాలాగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఇమేజ్ను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారి అంశాన్ని కూడా ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనలో ఇంకెవరి పాత్ర అయినా ఉన్నట్లు విచారణలో తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాజంలో నిమ్స్ ఆసుపత్రిపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికే కొందరు ఇలాంటి అపోహలను సృష్టిస్తున్నారని, కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇటువంటి దురుద్దేశపూర్వక ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ వాస్తవాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని డాక్టర్ బీరప్ప కోరారు.
