CJI Gavai : హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ , నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ న్యాయవాదులకు, న్యాయ రంగ ప్రవేశిస్తున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. నేటి ప్రపంచంలో న్యాయవ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన, “మన దేశం వివిధ లీగల్ ఛాలెంజెస్ను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో, న్యాయవాదులు , న్యాయ సేవలో ఉన్న వారు ‘ఎవరేం చెబుతున్నారు’ అనే విషయాన్ని క్షుణ్ణంగా వినడం చాలా ముఖ్యం,” అన్నారు.
“న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించే సమయం ఆసన్నమైంది. సరైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటే, ఇది తీర్పులను వేగంగా ఇవ్వడంలో దోహదపడుతుంది,” అని సీజేఐ పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలు విదేశీ డిగ్రీల కోసం ఆర్థికంగా భారమవ్వకూడదని హెచ్చరించిన ఆయన, “మన దేశంలోనే నాణ్యమైన న్యాయ విద్య ఉంది. విదేశీ డిగ్రీల వల్ల మన టాలెంట్ పెరుగుతుందనుకోవడం తప్పు. మన టాలెంట్ మన పనితనంతో నిరూపించుకోవాలి. ఫారిన్ డిగ్రీల కోసమే కుటుంబాలను అప్పుల పాలుచేయడం అవసరం లేదు,” అని చెప్పారు.
“మనం ఏ పని చేస్తున్నా, అది ఎంత మనసు పెట్టి చేస్తున్నాం అనేది ముఖ్యం. న్యాయ రంగంలో విశ్వాసం, నిబద్ధత, , ప్రజల సేవకే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి,” అని ఆయన యువ న్యాయవాదులకు సందేశమిచ్చారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులు, వారి కుటుంబాల్లో ఉత్సాహం కనిపించింది. ముఖ్య అతిథుల ప్రసంగాలు యువతలో ఆశాభావాన్ని పెంపొందించాయి. నల్సార్ యూనివర్సిటీ తన స్థాయిని నిరూపించుకుంటూ న్యాయవిద్యా రంగంలో దేశానికి ప్రతిభావంతులైన న్యాయవాదులను అందించడంలో ముందుండుతుందని చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు.
