Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు

Nalgonda Bus Fire

Nalgonda Bus Fire

Nalgonda Bus Fire: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న రెయిన్‌బో ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం, ప్రయాణ మధ్యలో బస్సు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని వెంటనే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన నిలిపివేసి ప్రయాణికులను వెంటనే దిగిపోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.