Nagababu Appeals Janasena Workers To Forgive CPI Narayana: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. మెగాబ్రదర్ నాగబాబు ఆయనపై సీరియస్ అవ్వడం, మెగా ఫ్యాన్స్ కూడా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. దీంతో నారాయణ దిగొచ్చి, తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. అంతేకాదు.. తాను దండం పెడుతున్నానని, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి.. సీపీఐ నారాయణను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికుల్ని కోరారు.
తప్పు ఎవరు చేసినా సరే… ఒకసారి క్షమాపణలు కోరిన తర్వాత వారిని క్షమించడం మన జనసైనికుల ధర్మమని చెప్పారు. సీపీఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని, ఆయన్ను ట్రోల్ చేయడం ఆపేయండని నాగబాబు పిలుపునిచ్చారు. కాగా.. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని అతిథిగా ఆహ్వానించడంపై సీపీఐ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్పై స్థానం లేదని, అతనో చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరుకి బదులు అల్లూరి సీతారామరాజుగా నటించిన సూపర్స్టార్ కృష్ణని పిలవాల్సిందని పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్ ల్యాండ్మైన్ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నాగబాబు తీవ్రంగా స్పందించారు. నారాయణ అన్నం తినడం మానేసి.. కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారని నాగబాబు అన్నారు. మెగా ఫ్యాన్స్ ఆయనతో ఆయనతో గడ్డి తినడం మాన్పించి, కాస్త అన్నం పెట్టండి అని ఘాటుగా స్పందించారు. అటు.. మెగా ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేసి, నెట్టింట్లో ఏకిపారేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని చెప్పిన నారాయణ.. తన వ్యాఖ్యలను భాషా దోషంగా భావించాలని చెప్పారు.