NTV Telugu Site icon

YS Viveka Murder Case: మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వైఎస్‌ వివేకా కేసులో ఉత్కంఠ..!

Mp Avinash Reddy

Mp Avinash Reddy

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని వరుసగా ప్రశ్నిస్తోంది.. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని మూడు సార్లు ప్రశ్నించిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ).. నాల్గోసారి ప్రశ్నించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపగా.. వాటికి అనుగుణంగా ఈ రోజు విచారణకు హాజరుకానున్నారు.. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరుకాబోతున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి..

Read Also: Astrology : మార్చి 14, మంగళవారం దినఫలాలు

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై నాలుగోసారి ప్రశ్నించబోతోంది సీబీఐ.. ఇప్పటికే జనవరి 28వ తేదీన, ఫిబ్రవరి 24వ తేదీన, మార్చి 10న అవినాష్‌రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు.. మరోవైపు.. తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి.. దీంతో, సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచింది.. అయితే, తుది తీర్పు వెలువడే వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్‌ చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.. మొత్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయనున్నారు సీబీఐ అధికారులు.. మరోవైపు.. నిజానిజాలు లక్ష్యంగా కాకుండా.. ఓ వ్యక్తి లక్ష్యంగా విచారణ సాగుతోందని.. నాపై కుట్ర జరుగుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఇక, ఇవాళ్టి సీబీఐ విచారణలో ఏం జరుగుతోంది? అనేది ఉత్కంఠగా మారింది.