NTV Telugu Site icon

దీక్షకు సిద్ధమైన మోత్కుపల్లి.. రేవంత్‌రెడ్డికి నిరసనగా..!

దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు… రేపు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటన ప్రకారం.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొన్న మోత్కుపల్లి… దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం, దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోందని దుయ్యబట్టారు.. జన్మతః దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో దళితుల మధ్య నిద్రలు చేసి భోజనం చేయగలడా..? అని ప్రశ్నించారు మోత్కుపల్లి.

గత 70 సంవత్సరాలుగా ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు నుండి చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ రెడ్డి చెప్పగలడా..? అని నిలదీసిన మోత్కుపల్లి… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఎంతో శోచనీయం అన్నారు… దళిత ముసుగు కప్పుకొని అణగారిన వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ వైఖరి సమంజసం కాదు.. దళితులను ముందు వరుసలో నుంచోబెట్టి రాజకీయం చేయడం, దళితుల మీద ప్రేమ వలకబోసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నా.. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 29న ఆదివారం నాడు బేగంపేట నా నివాసంలో ఒకరోజు దీక్షకు ఉపక్రమిస్తున్నానని.. రేపు ఉదయం 9గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత.. ఇంటికి వెళ్లి దీక్ష చేస్తానని తన ప్రకనటలో పేర్కొన్నారు మోత్కుపల్లి. కాగా, గతంలో బీజేపీలో ఉన్న మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తెచ్చిన తర్వాత.. ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.