Site icon NTV Telugu

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..

Drugs Case

Drugs Case

మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌లో జరిగిన సంచలన డ్రగ్స్ పార్టీ , కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థ ‘ఈగల్ టీమ్’ కీలక వివరాలను వెల్లడించింది. నిన్న రాత్రి పక్కా సమాచారంతో ఫామ్‌ హౌస్‌ను చుట్టుముట్టిన సమయంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈగల్ టీమ్ వెల్లడించిన కథనం ప్రకారం, పోలీసులు ఫామ్‌ హౌస్‌ను ముట్టడించిన సమయంలో లోపలి నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయి. ఈ గగుర్పునొడిచే పరిణామాల మధ్య ఏమాత్రం వెనక్కి తగ్గని పోలీసులు, వెంటనే లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాలిలోకి కాల్పులు జరిపి హంగామా సృష్టించిన నమిత్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు.

IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!

ఈ సోదాల సమయంలో ఫామ్‌ హౌస్‌లో ఒక మహిళతో సహా మొత్తం 11 మంది మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అనుమానాస్పద నార్కోటిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శరత్ కుమార్ వద్ద 0.26 గ్రాముల కొకైన్ లభించగా, ఈ డ్రగ్స్‌ను తాను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ కావడం గమనార్హం.

ఈ కేసులో ఈగల్ టీమ్ పేర్కొన్న నిందితుల జాబితాలో రాజకీయ ప్రముఖులు , వీఐపీలు ఉండటం సంచలనంగా మారింది. నిందితులుగా పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ , శ్రవణ్ కుమార్‌లను పోలీసులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలాంటి కేసుల్లో పట్టుబడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం నిందితులపై నార్కోటిక్ చట్టంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి కాల్పులు జరిపినందుకు గాను ఆయుధ చట్టం (Arms Act) కింద కూడా కేసులు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.

Exit mobile version