రాష్ట్ర బడ్జెట్ – 2022-23 లో జిల్లా ప్రజా పరిషత్లు, మండల ప్రజా పరిషత్లకు గ్రాంట్ పెంచాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. జిల్లా ప్రజా పరిషత్లు, మండల ప్రజా పరిషత్లకు ఈ బడ్జెట్ లో గ్రాంట్ ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రుల నివాసంలో మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ నిధుల పెంపు ద్వారా జిల్లా, మండల పరిషత్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేయడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు. ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా నిమ్స్ దవాఖానాలో ఉచిత వైద్యం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు వీలు కలుగుతుందని చెప్పారు.
ఈ ప్రతిపాదనను పరిశీలించి ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి నిధులు పెరిగే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లికి అందించిన విజ్ఞాపన పత్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. కాగా, మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ లు కూడా ఉన్నారు.
