ఒక యజ్ఞంలా పాఠశాలల అభివృద్ధి.. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు దిద్దేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డి.. మన ఊరు, మన బడి పథకం అమలుపై చర్చించారు.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే బృహత్తర కార్యక్రమం మన ఊరు – మన బడి…. మన బస్తీ – మన బడి అని పేర్కొన్న మంత్రులు.. రూ.7289.54 కోట్లతో మూడు దశల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదివే 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.. మొదటి దశలో 60 శాతానికి పైగా విద్యార్థులు చదివే 35 శాతం పాఠశాలలు ఎంపిక చేశామని.. ఒక యజ్ఞంలా పాఠశాలల అభివృద్ధి… ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు దిద్దుతామన్నారు..
Read Also: KCR: యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోయింది..
గ్రామాల్లో మన ఊరు మన బడి, పట్టణాల్లో మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందని విద్యా శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,హరీష్ రావులు తెలిపారు.. మొదటి దశలో 35 శాతం పాఠశాలలను ఇప్పటికే గుర్తించినట్లు వాటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. 12 అంశాలతో రాష్ట్రంలోని 9,123 పాఠశాలలను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మూడు సమావేశాలు నిర్వహించాలని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో, జడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీపీ, లైబ్రరీ చైర్మన్లతో, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని మంత్రులు కలెక్టర్లకు ఆదేశించారు. స్థానిక పట్టణ, గ్రామీణ ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక గ్రంథాలయం ఉండేలా చూడాలని మంత్రులు ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఈ పథకానికి నిధుల కొరత ఉండదని ప్రత్యేక ఖాతాలు తెరిచి నిధులు ఖర్చు చేయాలన్నారు. అవసరం ఉన్న మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు ఖర్చు చేయాలని,15 రోజుల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని సూచించారు.. ప్రతి పనికి సామాజిక తనిఖీ ఉంటుందని, అధికారుల తనిఖీలు ఉంటాయని అన్నారు. ముందుగా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, 12 అంశాల వారిగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారం కూడా తీసుకోవాలని, కోటి రూపాయలు విరాళంగా ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెట్టడం జరుగుతుందన్నారు. ఒకే కాంపౌండ్ వాల్లో జూనియర్ కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాలు ఉంటే వాటిని కూడా కలుపుకొని అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు మించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసారన్నరు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకున్నారని, దశల వారీగా ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డి.
