తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు.
మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎవరైనా స్కూళ్ల అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తే వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు మంత్రి సబిత చెప్పారు. ఫీజుల నియంత్రణ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో స్కూళ్లలో ఫీజులపై నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలపై నివేదిక తెప్పించుకున్నా మని.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని సబిత తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లను కేటాయించిన కేంద్రం… తెలంగాణకు మాత్రమే ఏ ఒక్కటి ఇవ్వలేదని మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
