Site icon NTV Telugu

తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించండి.. దేశ వృద్ధి రేటుకు ప్రయోజనం..

తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన గతి శక్తి సౌత్ జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేటీఆర్… మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్, పవర్, బొగ్గు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు.. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 35 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందన్న ఆయన.. భౌగోళిక వనరులలో సహజ ప్రయోజనాలు, ప్రపంచస్థాయి నైపుణ్యం, ఇప్పటికే ఉన్న తయారీ పద్ధతులు, నైపుణ్యంతో… పెట్టుబడులకు కొత్త అవకాశాలను కల్పించామని తెలిపారు. కానీ, పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు తగిన సహకారం అందడం లేదని.. పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.

Read Also: ఇక 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌..!

తెలంగాణలో హైదరాబాద్‌కు అనేక దశాబ్దాల చరిత్ర ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.. రక్షణ రంగానికి సంబంధించిన పటిష్టమైన పర్యావరణ వ్యవస్థ ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ… కేంద్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రక్షణ కారిడార్‌ను ఇచ్చింది.. అక్కడ ఎటువంటి పర్యావరణ వ్యవస్థ ఉనికిలో లేదు… సంస్థలు కూడా లేవు అన్నారు. డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్, ఆర్‌ఎస్‌ఐ, అనురాగ్ వంటి రక్షణ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉంది.. అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్‌ను స్థావరంగా మార్చుకున్నాయన్నారు. రాష్ట్రం చాలా అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.. రక్షణ కారిడార్‌కు మేం కేరాఫ్ అడ్రస్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అన్నారు. పెరిగిన ఫ్రీక్వెన్సీతో వివిధ పోర్టులకు ప్రత్యేకమైన కార్గో రైలు నెట్‌వర్క్‌ను అందించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్… లాజిస్టిక్ మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరు చేస్తే… రాష్ట్రం డ్రై పోర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్ అండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేసుకునే వీలు ఉందన్న ఆయన.. హైదరాబాద్‌కు అన్ని ఓడరేవులకు రైలు సౌకర్యం ఉన్నప్పటికి.. ఓడరేవులకు రైళ్ల రాకపోకలు ప్రధాన సమస్యగా మారిందని.. గూడ్స్ వేగంగా వెళ్లేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలి కోరారు. నార్త్-సౌత్ ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ ప్రాంతాన్ని తాకకుండానే… తెలంగాణ మీదుగా వెళ్తోంది.. మేక్ ఇన్ ఇండియా.. ఇప్పుడు అసెంబ్లింగ్ ఇన్ ఇండియా కార్యక్రమంగా మారింది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తే… భారత వృద్ధి రేటుకు ప్రయోజనం చేకూరుస్తుంది.. దేశ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవడానికి గణనీయంగా దోహదపడుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్.

Exit mobile version