తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారని, వరిని గతంలో కొన్నట్లు కొనమని కేంద్రాన్ని కొరినం.. పీయూష్ గోయల్ ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదు… మీ ప్రజలకు నూకలు తినిపియ్యడం నేర్పించాలని అవమనించాడని ఆయన మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం దేశం నుంచి కోటి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందని, పీయూష్ గోయల్ లజ్జ లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సీజన్ మొదట్లోనే వరి పంట వేయొద్దని మేము చెప్పినమని, బండి సంజయ్ ఢిల్లీలో పరపతి ఉన్నట్లు వరి వేయండి మేము కొనిపిస్తాం అన్నాడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాయిల్ రైస్, రా రైస్ అయినా కొంటారని చెప్పినారన్నారు. నమ్మించి మోసం చేసే బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పినా వినక కొందరు వరి వేశారని, తెలంగాణలో బీజేపీ నాయకుల హడావుడితో రైతులు ఆగమాగం అయి 35 వేల ఎకరాల్లో వరి వేశారన్నారు. అచ్చెదిన్ దివాస్ రోజు పార్లమెంట్ లో పీయూష్ గోయిల్ వడ్లు కొనమని చెప్పిండని, వాళ్ళ మంత్రి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడికు తెలియదా అని అడుగుతున్నా అని ఆయన ప్రశ్నించారు. పీయూష్ గోయల్కు బలుపు, ఢిల్లీ బీజేపీ ఒక మాట సిల్లి బీజేపీ ఇంకోటి చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దామని, పై మోడీ కింద బోడి అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారన్నారు.
8వ తారీఖున తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి, ప్రతి ఊర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలే అంటూ ఆయన పిలుపునిచ్చారు. 11వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
