Site icon NTV Telugu

Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి బరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి..! ఖరారు చేసిన కేసీఆర్..

Marri Rajasekhar Reddy

Marri Rajasekhar Reddy

Marri Rajasekhar Reddy: బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ స్థానానికి ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారు కాగా.. తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ మరో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఆ స్థానం నుంచి మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీకి దింపాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.

మర్రి గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో గులాబీ బాస్ మర్రికి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. వారికి అంతర్గతంగా సమాచారం అందించినట్లు సమాచారం. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీఆర్‌ఎస్ మల్కాజిగిరి అభ్యర్థిగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం తొలుత ముగ్గురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి, అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. చింతల విజయశాంతి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిలోనూ ఆమె నిలిచారు. మేయర్ సీటు సాధారణ మహిళకు కేటాయించడంతో విజయశాంతి పోటీలో నిలిచారు. అయితే ఆ పదవిని కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికి కేటాయించడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మల్కాజిగిరి మహిళా కోటా రేసులో నిలిచినా సీఎం కేసీఆర్ మాత్రం మర్రి రాజశేఖర్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.
Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్‌.. జిల్లా ఆసుపత్రుల్లోనే క్యాన్సర్‌కు చికిత్స..

Exit mobile version