Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు

  • మంథని నియోజకవర్గంలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • రెండేళ్లలో మంథని అభివృద్ధికి రూ.800 కోట్లు: శ్రీధర్ బాబు
  • రూ.20 కోట్లతో NAC సెంటర్ మంజూరు: కోమటిరెడ్డి
  • గోదావరి బ్రిడ్జికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. బుధవారం మంథని నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడిగా పాల్గొని రూ.164 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రాంతాభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు.

మంథని అభివృద్ధికి రూ.800 కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం దాదాపు రూ.800 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే నేడు రూ.164 కోట్లతో వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. గోదావరి నదిపై ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని క్రమంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.

రూ.20 కోట్లతో న్యాక్ సెంటర్ మంజూరు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో మంథని ప్రాంతానికి ఎనలేని సేవలుందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్ శ్రీపాద రావుల సేవలను స్మరించుకున్నారు. ఈ నియోజకవర్గ పురోగతికి రూ.800 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. యువతకు ఉపాధి, సాంకేతిక శిక్షణ అవకాశాలను విస్తరించేందుకు మంథనిలో రూ.20 కోట్ల వ్యయంతో న్యాక్ (NAC) సెంటర్‌ను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.