Mahesh Kumar Goud Fires On TRS Leaders Over Flexis: టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ ప్రకటన తర్వాత కూడా హైదరాబాద్లో టీఆరెస్ ప్లేక్సిలే కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన.. ఆ ప్లేక్సిలో భారత్ మ్యాప్ వేశారని, అందులో జమ్ముకశ్మీర్ మ్యాప్ లేపేశారని అన్నారు. భారత్ మ్యాప్లో నుంచి జమ్ముకశ్మీర్ని లేకుండా పెట్టడం బాధాకరమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మన భారత మ్యాప్పై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. పాకిస్తాన్ కూడా కశ్మీర్ లేకుండా మ్యాప్ చూపిస్తుందని, అదే తరహాలో టీఆర్ఎస్ నేతలు కశ్మీర్ లేకుండా తమ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ వేశారని, ఇది దేశద్రోహమే అవుతుందని అన్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. అంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్ తమతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేతలు సైతం టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్కు 70 స్థానాలు రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తమ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగరేస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం గంజాయి స్టేట్గా, డ్రగ్స్కు కేంద్రంగా మారిందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రం బాగు పడుతుందని, బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు.