తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉంది.
శుక్రవారం నిజామాబాద్లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు వున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి టి లో 6డిగ్రీలు, బేలాలో 6.9 డిగ్రీలు, పొచ్చరలో 6.9డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరమెరి 7.8, మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 8 గా నమోదయింది. నిర్మల్ జిల్లా పెంబిలో 8.1 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.