Lothukunta Land Case: హైదరాబాద్లోని లోతుకుంట భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి తీవ్రస్థాయిలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరించడంపై హైకోర్టు ధర్మాసనం హైడ్రా (HYDRAA) తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విచారణకు హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరిపై న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు
విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ, నీటిపారుదల (ఇరిగేషన్) చట్టాలను పక్కనబెట్టి కేవలం హైడ్రా చట్టం ఒక్కటే ఉందా?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు ఒక అలవాటుగా మారిపోయిందని ధర్మాసనం మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం అనేది కోర్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేదని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలు లెక్కచేయకపోవడం తీవ్ర నేరం
కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఉన్నత స్థానాల్లో అప్పీలు చేయకుండా, మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్రమైన నేరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక సాధారణ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లోతుకుంట భూముల్లోకి ఎలా వెళ్తారని హైడ్రా అధికారులను ప్రశ్నించింది.
కమిషనర్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

