రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..230 ఓట్లు మెదక్లో కాంగ్రెస్కు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా నా భార్యను పోటీలో నిలబెట్టానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడం వల్లనే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి రెండు ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఉమ్మడి మెదక్లో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20 వేల కోట్లు స్థానిక సంస్థలకు రీలీజ్ చేయా లి. అలా రిలీజ్ చేస్తే..నా భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్ డ్రా చేసుకుంటామని జగ్గారెడ్డి అన్నారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే.. వచ్చే మా ప్రభుత్వంలో జిల్లాకు రూ. 20 వేల కోట్లను తీసుకొస్తామన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఉండాలి. అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలబెట్టడం వల్లనే హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ను గెలిపించి రాజాలా బతుకుతారో టీఆర్ఎస్ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోవాలని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.