TG SAFE : హైదరాబాద్ కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో మొత్తం 20 ఫుడ్ సంస్థలను తనిఖీ చేశారు. ఇందులో రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు ఉన్నాయి. తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.
20 సంస్థల్లో తనిఖీలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. పలు సంస్థల్లో నిల్వ చేసిన మాంసం, కూరగాయలు పాడైపోయినట్లు గుర్తించారు. కొన్ని చోట్ల బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలను తయారు చేసే ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు రిఫ్రిజిరేటర్ల నిర్వహణ కూడా సరిగా లేదని గుర్తించారు.
కల్తీ అనుమానంతో 20 శాంపిల్స్
ఆహార పదార్థాల్లో కల్తీ ఉన్నట్లు అనుమానించిన అధికారులు మొత్తం 20 శాంపిల్స్ను సేకరించారు. పురుగులు పట్టిన, పాడైపోయిన వేరుశెనగలు, పిండి, ఎండు మిరపకాయలు వంటి ముడి పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. వెజిటేరియన్, నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలను సక్రమంగా వేరు చేయకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం వంటి ఉల్లంఘనలను కూడా గుర్తించారు.
లైసెన్స్ లేకుండానే హాస్టల్ నిర్వహణ
GVK New Luxury PG Men’s Hostel ఎలాంటి FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. దీంతో అధికారులు ఆ హాస్టల్ను మూసివేశారు. ఆహార పదార్థాలను నిర్వహించే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం, సరైన రికార్డులు నిర్వహించకపోవడం వంటి అంశాలను కూడా అధికారులు గుర్తించారు.
ఐదు సంస్థల లైసెన్సులు సస్పెండ్
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను TG SAFE సస్పెండ్ చేసింది. వాటిలో మణికంఠాస్ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్, శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్, హోటల్ సితార గ్రాండ్, బేక్ మ్యాక్స్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రౌన్ బేర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్), మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ సంస్థలు తక్షణమే కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
మరికొన్ని సంస్థలకు నోటీసులు
గుమ్మడి ఫుడ్స్, కేఎస్ బేకర్స్, లక్ష్మీ వెంకమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, మెహ్ఫిల్ రెస్టారెంట్, శ్రీ హర్ష డీలక్స్ మెస్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, చైతన్య ఫుడ్ కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయి సంస్థలకు జరిమానాలకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లిలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు హైదరాబాద్లో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా జరిగాయి. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఇలాంటి తనిఖీలను అధికారులు కొనసాగిస్తున్నారు.

