Site icon NTV Telugu

Bus Fire : కూకట్‌పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

Bus Fire

Bus Fire

శుక్రవారం రాత్రి భాగ్యనగరంలోని కూకట్‌పల్లిలో పెను అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు కేపీహెచ్‌బీ మెట్రో పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. అయితే, బస్సు డ్రైవర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి 18 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. మంటలు బస్సును నిలువునా దహించివేసినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం కలిగించింది.

 Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!

వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు బయల్దేరిన దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (నెం. NL 02 B 9955), కొండాపూర్‌ , మియాపూర్‌ మీదుగా రాత్రి 10 గంటల సమయంలో కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ 734 వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని గ్రహించిన డ్రైవర్, వెనువెంటనే ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు.

ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి భీభత్సం సృష్టించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు మెజారిటీ భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితోనే పెను ముప్పు తప్పిందని ప్రయాణికులు , అధికారులు అభినందిస్తున్నారు.

రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

Exit mobile version