Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రమంతా సంబురాలు జరుపుకుంటున్న పవిత్రమైన రోజున, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇక్కడి గడ్డపై నిలబడి తన అక్కసు వెళ్లగక్కడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కు అణువణువునా ఉన్న ద్వేషం, వివక్ష ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ‘మీ అయ్య జాగీరా’ అంటూ వాడిన భాష చూస్తుంటే తమ రక్తం మరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వేలాది మంది అమరవీరులను ఘోరంగా అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము మంత్రి పదవులను సైతం త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన చరిత్ర గలవాళ్లమని గుర్తుచేశారు. ప్రస్తుతం టీడీపి, బీజేపీలు కలిసి జట్టుగా చేరి తెలంగాణపై మళ్లీ కొత్త కుట్రలు చేస్తున్నాయనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
“ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఎవరూ అడ్డుకోరు. కానీ తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం అస్సలు సహించేది లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ఇక్కడి అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఆ తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు పవన్ కళ్యాణే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వబోమని, అవసరమైతే దీని కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికైనా ప్రభుత్వం వెనకాడబోదని మంత్రి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ఎంతకైనా తెగిస్తామని తేల్చిచెప్పారు.
ఆరుసార్లు చట్టసభలకు ఎన్నికైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్కు ఒక మంచి సలహా ఇస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, తెలంగాణలో రాజకీయ విద్వేషాలు రేపడం మానేసి తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. రెండు తెలుగు ప్రాంతాలు అభివృద్ధిలో పోటీపడాలి తప్ప, ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతూ.. “తస్మాత్ జాగ్రత్త” అని హెచ్చరించారు.
