Komatireddy Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి, కుటుంబంలో ఇద్దరికి పదవుల అంశంపై వస్తున్న విమర్శలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. “నేను ఎప్పుడూ పదవులు అడుక్కోను.. నేనొక ఫైటర్ను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక రెవల్యూషన్ (విప్లవం) లాగే ఉంటుంది” అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. తనను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారని, అలాగే ఎమ్మెల్సీ పోటీలో తాను నిలబడితే ఆనాడు కేసీఆర్కు నిద్ర కూడా పట్టలేదని తన రాజకీయ రికార్డును గుర్తుచేశారు.
ఐదుగురికి ఇచ్చి.. నా ఒక్కడినే పక్కన పెట్టారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఎన్నికల ముందు ఏఐసీసీ (AICC) నాయకత్వం ఆరుగురు సీనియర్లకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. “హైకమాండ్ ఆరుగురిలో ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చింది. కానీ నా ఒక్కడికే ఇవ్వలేదు. అలాగని నేను పదవి కోసం అడుక్కునే టైం ఇది కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తన అంతరంగాన్ని ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు.
అన్నాదమ్ములు ఒకే కుటుంబం ఎలా అవుతారు? ఒకే ఇంట్లో లేముగా
సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున, ‘ఒకే కుటుంబానికి ఒకే పదవి’ అనే నిబంధన వల్లే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ రూల్స్ పై స్పందిస్తూ.. “భార్యాభర్తలు మాత్రమే ఒక కుటుంబం కిందకు వస్తారు. కానీ అన్నాదమ్ములు ఒకే కుటుంబం ఎలా అవుతారు?” అని ప్రశ్నించారు.
దీనికి ఉదాహరణగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులను ప్రస్తావిస్తూ.. “ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ ఒకే ఫ్యామిలీ అవుతారు. కానీ మేము (వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి) అన్నదమ్ములం, ఇద్దరం వేర్వేరు ఇళ్లలో ఉంటున్నాం. అలాంటప్పుడు అన్న, నేను ఇద్దరం ఒకే కుటుంబం అంటే ఎలా కుదురుతుంది?” అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. భిన్నమైన ఇళ్లలో ఉంటూ రాజకీయంగా విడివిడిగా కష్టపడుతున్న తమకు ఈ నిబంధన వర్తింపజేయడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

