NTV Telugu Site icon

ఉద్యమకారులెక్కడ..? మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు

హుజురాబాద్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ పై మాటల తూటాలు పేల్చారు. క్యాబినెట్‌లో ఉన్న వాళ్లలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో చెప్పాలని శ్రీధర్‌ బాబు డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌కు ఈ మధ్య కాంగ్రెస్‌ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. భట్టి మంచోడు అంటాడు, మంచోడైన భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్‌కు గాడ్సే రావడం కాదు టీఆర్‌ఎస్‌ భవన్‌లోకి తెలంగాణ ద్రోహులు చేరారన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళే కదా మంత్రులు అని శ్రీధర్‌ బాబు అన్నారు. గాంధీని చంపిన గాడ్సేకి మద్దతు ఇచ్చే బీజేపీతో అంట కాగుతుంది ఎవరు..? ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ చేస్తుంది టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కాదా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు. కేటీఆర్‌ మాటలు చూస్తుంటే జాలి వేస్తుందని …నాయకులు కలిస్తే పార్టీ మారినట్టేనా అని శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు.