KBR Park Video : నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నడుం బిగించిన విషయం తెలిసిందే.. అయితే… కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎంతో అద్భుతమైన ప్లానింగ్తో ఈ సరికొత్త ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి పర్యావరణ ప్రేమికుల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్వస్తి పలికారు. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్కు ఎలాంటి నష్టం కలగకుండా ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘జీరో పార్క్ ఇంట్రూజన్’ (అంటే పార్క్ స్థలాన్ని ఒక ఇంచ్ కూడా తాకకుండా) పద్ధతిలో, కేవలం ప్రస్తుత రోడ్డు మీడియన్స్లోనే ఫ్లైఓవర్లు, అండర్పాస్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకబోమని అధికారులు హామీ ఇచ్చారు. కేవలం సెంట్రల్ మీడియన్లో అడ్డంగా ఉన్న కొన్ని చెట్లను మాత్రమే ఆధునిక ‘ట్రాన్స్ప్లాంటేషన్’ పద్ధతి ద్వారా వేర్లతో సహా సురక్షితంగా వేరే చోటికి తరలించనున్నారు.
సాధారణ కాంక్రీట్ నిర్మాణాల వల్ల నెలల తరబడి ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి. అందుకే ఈ ప్రాజెక్టులో కాంక్రీట్కు బదులుగా ‘స్టీల్ ఫ్లైఓవర్ల’ నిర్మాణానికి జీహెచ్ఎంసీ మొగ్గు చూపింది. స్టీల్ నిర్మాణాల వల్ల పనులు ఏకంగా 30 నుండి 40 రెట్లు వేగంగా పూర్తవుతాయి. ఈ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కూడా వాహనదారులకు, స్థానిక ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిలింనగర్ వరకు ప్రయాణం పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారనుంది. రోడ్ నెం.45, ఫిల్మ్నగర్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, , ముగ్ధా జంక్షన్లను కలుపుతూ ఈ భారీ కారిడార్ను డిజైన్ చేశారు. దీనివల్ల జూబ్లీహిల్స్ నుండి ఐటీ హబ్ మాదాపూర్ వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
అభివృద్ధి, పర్యావరణ సమతూకంతో ‘గ్రీన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. ఈ కారిడార్ పూర్తయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఏకంగా 72 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ జాప్యం తగ్గడం వల్ల ఏటా దాదాపు 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం (పెట్రోల్/డీజిల్) ఆదా అవుతుంది. తద్వారా సుమారు 13.66 lakhs టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించవచ్చని జీహెచ్ఎంసీ లెక్కగట్టింది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే, సిటీ ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు హైదరాబాద్కు ఒక మకుటాయమానంగా నిలవనుంది.
