Site icon NTV Telugu

Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ

Kavitha O

Kavitha O

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు తన పాలిట నైతిక విజయమని (Moral Victory) ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐదున్నర నెలల పాటు జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్వయంగా జడ్జి తీర్పు ఇవ్వడం ద్వారా కేంద్రం పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయమని కోర్టు అనడం అంటేనే ఈ కేసులో దర్యాప్తు సంస్థల వద్ద ఏమీ లేదని తేలిపోయిందని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కవిత తన సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు, నేను అరెస్టు అయినప్పుడు ఎక్కడికి వెళ్లారు?” అని ఆమె నిలదీశారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరూ తెలియదని, ఎంపీగా ఉన్న కారణంగా కేవలం సంజయ్ సింగ్‌తో మాత్రమే పరిచయం ఉండేదని వివరించారు. దర్యాప్తుకు తాను ఎప్పుడూ సహకరించానని, తన దగ్గర ఉన్న ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చి ఆధారాలు ఉంటే చూసుకోమని చెప్పానని గుర్తు చేశారు.

సమాజం పట్ల మావోయిస్టు అగ్ర నేతలకు తన కంటే లక్ష రెట్లు ఎక్కువ అవగాహన ఉందని కవిత వ్యాఖ్యానించారు. “నేను బయట ఉండి పోరాటం చేస్తే, వారు అడవుల్లో ఉండి సమాజం కోసం ఫైట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు లొంగిపోయి మావోయిస్టు సిద్ధాంతాన్ని బతికించారు” అని ఆమె పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మాజీ మావోయిస్టులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆమె విమర్శించారు. ఇదే క్రమంలో, తాను సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో చాలా ‘సర్‌ప్రైజ్‌లు’ ఉంటాయని హింట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కుమ్మేర ఘటన బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. తాను సమస్యలు ఉన్న దగ్గర షో చేయడానికి వెళ్ళనని, ఘటన జరిగిన రోజునే ఎస్పీతో మాట్లాడానని స్పష్టం చేశారు. అలాగే గాంధీ సరోవర్ కింద గాంధీ విగ్రహం కట్టడాన్ని తప్పు పట్టనని, అయితే ఆ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతి తనకు సహకరిస్తోందని, నిజం నిలకడగా తెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Ayesha Meera case: ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సీబీఐ

Exit mobile version