Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాల కోసం ప్రజాధనాన్ని ఎలా వృథా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ముందుగా లాభాల బాట పట్టించి, ఆ తర్వాత వచ్చే ఆదాయంతో ఇటువంటి ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేయవచ్చు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు భూసేకరణ బాధితులకు సరైన న్యాయం జరగక వారు నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రేపటి విచారణలోగా స్పష్టం చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
భూ బాధితుల సమస్యలపై పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూనే, కేసు తదుపరి విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. కాగా, నిరుపేద మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఉన్న స్టేను తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరిన నేపథ్యంలో, రేపటి విచారణలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

