Telangana High Court : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల అమలుపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనంలో కీలక విచారణ జరిగింది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ గతంలో విధించిన మధ్యంతర స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
విచారణార్హతపై సుదీర్ఘ వాదనలు
అప్పీలు పిటిషన్ విచారణార్హత (Maintainability)పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) వాదనలు వినిపిస్తూ.. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు సామాజిక ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయ పథకాలను ఎంతో ప్రయోజనకరంగా అమలు చేస్తోందని కోర్టుకు తెలిపారు.
పిటిషన్ను కొట్టివేయాలని ఏజీ విజ్ఞప్తి
ఈ పథకాల ఆధారంగా జారీ చేసిన జీవోలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏజీ పేర్కొన్నారు. పథకాల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన మూల పిటిషన్కు ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని, కాబట్టి ఆ పిటిషన్ను పూర్తిగా కొట్టివేయాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం, కల్యాణలక్ష్మి , షాదీముబారక్ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

