ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటనను సోమవారం రోజు అడ్డుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఆయనను జిల్లా సరిహద్దులో అడ్డుకున్నారు.. అంతేకాదు, ఓ టీఆర్ఎస్ కార్యకర్త పాల్పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, తాను మళ్లీ సిరిసిల్ల వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు కేఏ పాల్.. నాపై దాడి చేసిన అనిల్తో నాది తెలంగాణ కాదని చెప్పిస్తున్నారు.. బాబు అనిల్ మత్తు తగ్గిన తరువాత ఇది విను.. నేను తెలంగాణ వ్యక్తినే.. 1981 నుంచి నేను తెలంగాణలోనే ఉన్నాను అన్నారు..
Read Also: Jagga Reddy: కేసీఆర్ను కలుస్తా.. రాహుల్ గాంధీ టూర్కి అనుమతి కోరతా..!
ఇక, 150కి పైగా దేశాల్లో నాకు ఛారిటీలు ఉన్నాయని తెలిపారు కేఏ పాల్.. నాపై దాడి విషయంపై డీజీపీకి కాల్ చేస్తే, రిటర్న్ కాల్ కూడా చేయలేదని వాపోయిన ఆయన.. ఒకప్పుడు నన్ను కలిసిన డీజీపీ ఇప్పుడు ఎందుకు కలవడం లేదు..? సీపీ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ అందరూ బిజీయేనా.? నన్ను ఎంతకాలం బంధిస్తారు..? అంటూ మండిపడ్డారు. సిరిసిల్ల రైతులు తెలంగాణ రైతులు కాదా..? అని ప్రశ్నించిన పాల్.. నేను రైతులకు, నిరుద్యోగులకు అండగా ఉన్నాను, ఉంటాను.. మీపై నమ్మకం లేకనే రైతులు నన్ను ఆశ్రయించారన్నారు.. నాపై జరిగిన దాడి రైతుల మీద జరిగిన దాడి కాదా ? అని నిలదీశారు. అన్ని పార్టీల సభలకు పర్మిషన్ ఇచ్చి, నాకెందుకు ఇవ్వడం లేదు..? అని ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్.. నేను కోటి మంది కుటుంబాలకు ఇళ్లు ఇవ్వగలను.. 100 కంపెనీలు పెట్టి కోటి ఉద్యోగాలని ఇవ్వగలను.. అప్పుడు జోకర్ అన్నారు.. ఇప్పుడు నాపై పంచులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తాను 7 యుద్ధాలను ఆపాను.. కానీ, 3 యుద్ధాలని ఆపలేకపోయాను అన్నారు.